జాషువా, గబ్బిలంలో పేదవాడున్నది తంజావూరుకు దక్షిణభాగ భూముల్లో అని అనడమే తప్ప ఊరిపేరు వ్రాయలేదు.
దక్షిణభాగంలో ఏ ప్రాంతం? ఆ ఊరి పేరు ఎందుకు వ్రాయలేదు? అని ప్రశ్న.
ఊరిపేరుతో అవసరం ఏముంది? లేదు.
దక్షిణం నుండి ఉత్తరానికి (సందేశాన్ని తీసుకొని వెళ్లడం కోసం చేసే) యాత్ర. అంతే.
పైగా ఊరిపేరు వ్రాస్తే అదే ఎందుకు వ్రాశారని మళ్లీ ప్రశ్న తయారవుతుంది. ఆ ప్రాంతపు గొప్పతనం ఏముంది? మా ప్రాంతం గొప్ప, అది వ్రాయాల్సిందనే వాదోపవాదాలు బయలుదేరతాయి. దీన్ని అశోకవనికాన్యాయం అంటారు.
కులమతాలపేరుతో పుట్టే గొడవల్ని ఆపుదామనే మహదాశయంతో వ్రాసిన కావ్యమది. ఆ గొడవలకి తోడుగా ప్రాంతీయభేదాల్ని కూడా రేపే ఊళ్లపేళ్లు పేర్కొనడం అవసరమా? అని ఊరిపేరు వ్రాసి ఉండరు జాషువా అని నా(గ)స్వ(రం) అభిప్రాయం.
పైగా పేదవాడు చెప్పులు కుట్టి జీవించేవాడు. ఊరికి దూరంగా నివాసం. అటువంటప్పుడు ఏ ఊరయితేనేం.?
తంజావూరునుండి డైరక్ట్గా దక్షిణంగా సముద్రతీరం వఱకు సుమారు 120 కి.మీ. క్రాస్గా కన్యాకుమారి వఱకు సుమారు 420 కి.మీ.
ఈ దక్షిణంవైపు ఏ ప్రాంతం అంటే పేరు తెలియకపోయినా కొంతవఱకు తంజావూరునుండి పేదవాడి ప్రాంతం ఎక్కువ దూరం ఉండి ఉండదని ఊహించి చెప్పవచ్చు.
ఎందుకంటే ఆయన మొదట సందర్శించమని చెప్పింది తంజావూరును. ఈ లోపు ఏదైనా ప్రసిద్ధప్రాంతం ఉండి ఉంటే అది, కవిచేత పేర్కొనబడేదిగా!
అయితే తంజావూరులోనే ఉన్నట్టు చెప్పవచ్చుగా అంటే అక్కడే ఉన్నవాడికి తంజావూరును వర్ణించి చెప్పడం అసంగతం.
కవి, రఘునాథుడేలిన తంజావూరును యాత్రలో ప్రారంభ ప్రదేశంగా ఎంచుకొన్నారు. దానికి కారణం ఇంతకు ముందు వివరించడం జరిగింది.
కాబట్టి ఒక రచనాప్రణాళిక ప్రకారం కవి "తంజావూరుకు దక్షిణ భాగభూములన్ గాపురముండె" అని చెప్పేసి, అసలు విషయంలోకి వెళ్లిపోయినట్లుగా భావించవచ్చు.
మంగళం మహత్