10 వ తరగతి ఉపవాచకమైన రామాయణానికి, మూలానికి కొన్ని భేదాలున్నాయి.
జిజ్ఞాసువులకొఱకు అవి తెలిపే ప్రయత్నమిది.
సహృదయులు స్వీకరించగలరు.
మొదటగా రామాయణాన్ని వైష్ణవపరంగానే అర్థం చేసుకోవాలి.
మధ్యమధ్యలో వివరణలు, విశేషాలు ఉంటాయి.
బాలకాండము
ఉపవాచకంలో ఉన్నవి |
మూలంలో ఉన్నవి |
సకల కల్యాణ గుణాలున్నవాడు ఈ లోకంలో ఉన్నాడా? అని వాల్మీకి ప్రశ్న |
ఈ లోకంలో, “ఈ కాలంలో” అని కూడా ఉండాలి. వైకుంఠంలో విష్ణువుకు కూడా ఇలాంటి కల్యాణ గుణాలున్నాయి కాన ఈ లోకంలో అని, కాలాంతరాలలో నరసింహాదులకు కూడా ఇట్టి గుణాలున్నాయి కాన వారు కాదు అనడానికై ఈ కాలంలో అని చెప్పబడ్డాయి. |
రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి. |
ఇదేమీ లేదు. |
స్నానానికి బయలుదేరాడు |
వివరణ : మాధ్యాహ్నికస్నానం |
భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు |
కాదు. భరద్వాజుడు ఒకడే వెంట ఉన్నాడు. |
స్నానానికి నదిలో దిగిన |
లేదు. దిగలేదు. స్నానానికి ముందే దైవికంగా ఆ వనాన్ని చూడాలనే కోరిక కల్గి విశాలమైన ఆ వనమంతా కలయదిరిగాడు. |
మా నిషాద |
వివరణ : దీన్ని అద్భుతమైన మంగళాశాసనంగానూ చెప్పారు. మా నిషాద! యత్ క్రౌంచమిథునాత్ కామమోహితం ఏకం అవధీః శాశ్వతీ సమాః ప్రతిష్ఠాం త్వం అగమః దీనిద్వారా రామయణకథ, ఇంకా ఒక్కొక్కపదంనుండి ఒక్కొక్క కాండపుకథ సూచితమని విశారదుల వ్యాఖ్య. |
ఆశ్రమానికి తిరిగివచ్చారందరూ. |
ఇద్దరే అని తెలిసింది కదా! |
కాని క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసునుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన. అదే ఆవేదన. |
వివరణ : స్నానం చేసి, ఆ శ్లోకం పుట్టడాన్నే చింతిస్తూ, ఆశ్రమానికి వచ్చాడు. దేవపూజాదులు అయ్యాక, తనంతటతానే పుట్టిన ఆ శ్లోకాన్ని లోపల చింతిస్తూనే, పైకి పురాణాదుల్ని పారాయణం చేశాడు. బ్రహ్మ వచ్చాక క్రౌంచపక్షి దుర్దశ, గుర్తుకు వచ్చింది. ఆ శ్లోకాన్ని మది నిల్పి, పాడాడు. |
బ్రహ్మాదిదేవతలు, గంధర్వులు సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయారు. |
బ్రహ్మాదిదేవతలు అదృశ్యరూపులై ఉన్నారు. |
పౌలస్త్యవంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు.
|
పౌలస్త్య వంశ ప్రభవో రావణో నామ రాక్షసః అని మూలం. విశ్రవసువు కొడుకు అన్నాక ఇంక పౌలస్త్యవంశజుడు అనక్కరలేదు |
దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్కక్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. |
విశ్వామిత్రుడు చంపమని చెప్పి, ఆయనంతట ఆయనే ముందే స్త్రీ అని సందేహించకు అని వివరణ (ఎవరెవరు దుష్టులైన స్తీలను చంపారో) ఇచ్చేశాడు. రాముడు మీ మాట శిరోధార్యం అన్నాడు. |
అడుగులతోపాటు మాటలూ సాగుతున్నాయి. |
శోణానదీ తీరం చేరేదాక మాట్లాడుకుంటున్నట్లు వాల్మీకి వ్రాయలేదు. సూర్యాస్తమయం తర్వాత తీరంలో కూర్చొన్నాక రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. |
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యముంది. తన పూర్వికులు ఎంతగొప్పవారో తెలుసుకుని దానికనుగుణంగా నడవడం. పితరులపట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలపడం. పట్టిన పని ఫలవంతమయేవరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురుశిష్యుల వ్యవహారం. |
రాముడు అడిగాకే విశ్వామిత్రుడు చెప్పినప్పుడు ఇక ఆంతర్యం యొక్క అక్కఱ లేదు |
జనకమహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. |
శతానందుడు జనకుడునితో కలిసే విశ్వామిత్రరామలక్ష్మణులను దర్శించాడు. శతానందుడు విడిగా ఏమీ రామదర్శనం చేసుకోలేదు. |
జనకుడు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. |
విశేషం : విశ్వామిత్రుని కోరిక మేరకు జనకుడు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. |
అయోధ్యకాండము
(శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది.) రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. |
బ్రాకెట్ లోది సత్యం. మిగతాదంతా లేదు. |
భరతుడంటే నాకు ప్రాణం. |
అలా అనలేదు ప్రియమైన ప్రాణాన్నైనా ఇస్తా అన్నాడు. |
ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలిచేత నరికిన మద్దిచెట్టులా నేలమీద పడిపోయింది. |
గొడ్డలిచేత నఱుకబడిన చెట్టుబోదెలా అని, ఆ సందర్భంలోనే కూలిన అరటిలా అని, వాల్మీకి వర్ణన. |
రథం వేదశ్రుతి, గోమతీ, సనందికా నదులను దాటింది. |
స్యందికానది |
‘గుహుడు’ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామభక్తుడు. |
గుహుడు రాముని చెలికాడు. తర్వాత జనాలు భక్తుణ్ణి చేసేశారు. |
అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. |
నేరేడు కఱ్ఱలు కాదు. దీనికి మూలం తస్య తద్వచనం శ్రుత్వా సౌమిత్రిర్వివిధాన్ద్రుమాన్ | ఆజహార తతశ్చక్రే పర్ణ శాలామరిం దమ || |
ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. |
గుహుని గూఢచారులు సుమంత్రునితోనే స్వయంగా చెప్పారు. |
అరణ్యకాండము
శరభంగుడు తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు. (భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణసంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది. ఒక మహాకార్య సాధనలో ఎవరివంతు వారు సహకారమందించాల్సిందే.) |
తపఃఫలం కాదు. బ్రహ్మస్వర్గలోకాల్లో అక్షయాలైన భోగప్రదేశాల్ని ఆర్జించాను. అవి నీ కర్పిస్తాను. ప్రతిగ్రహించు అన్నాడు. (దీని వెనకాల పారమార్థిక తత్త్వం ఉంది.) రాముడు “తీసుకొంటాలే. మేము ఉండటానికి ఒక మంచి వాసస్థానం చూపు” అన్నాడు. బ్రాకెట్ లోది ఇంక అక్కఱ లేదు. |
సుతీక్ష మహర్షి తన తపశ్శక్తినంతా శ్రీరామునకు ధారాదత్తం చేశాడు. |
ఆయన “రామా!తపస్సుచేత నేను ఆర్జించిన సమస్తలోకాల్ని ఇస్తాను. ఆ లోకాల్లో సీతాలక్ష్మణులతో సుఖంగా విహరించు” అన్నాడు. అపుడు రాముడు నేనే నాయంతట లోకాల్ని సంపాదించుకొంటాను. ముందు మేము ఉండటానికి ఒక మంచి వాసస్థానం చూపు” అన్నాడు. |
తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీతరక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. |
వివరణ : జటాయువు రామునితో “నీవు ఇష్టపడితే వనవాసంలో నీకు సహాయుడనై ఉంటాను. మీరు ఇరువురు ఎక్కడికైనా వెళ్లినపుడు సీతను రక్షిస్తూంటాను.” అన్నాకే సీతరక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. |
శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు. |
పురాణ అని లేదు. కథాప్రసంగం |
శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. |
మూలం : స్మితపూర్వమథాబ్రవీత్ |
ఒకవైపు మారీచుడి మాటలు, మరొకవైపు శూర్పణఖ పలుకులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి. అయోమయంలో పడ్డాడు. |
ఇదేమీ లేదు |
అప్పుడప్పుడే నిద్రకుపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. |
నిద్రిస్తున్నాడు. సీత పిలిచాక మేల్కొన్నాడు. |
శ్రీరాముడి అనుమతిని తీసుకొని కబంధుడు స్వర్గానికి వెళ్లాడు. |
స్వర్గానికి వెళ్లినట్లు లేదు రామాయణంలో. రామునికి ఋశ్యమూక పర్వతానికి ఆకాశంలో నిలిచి, మార్గం చూపించి వెళ్లాడు అనే ఉంది. |
మిగతా కాండములు వీలు వెంబడి
రామాయణంలో ఏముంది?
అని తెలుపడానికే ఈ ప్రయత్నం.
స్వీకరించేవారు స్వీకరించండి.
వలదన్నవారు వదలివేయండి
మంగళం మహత్
రామార్పణమస్తు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి