"విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు"
అర్థం చెప్పగలరు.
పై పాదం పోతన రచించిన
ఆంధ్ర మహాభాగవతం
దశమ స్కంధం
కుచేలోపాఖ్యానంలోనిది.
ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ
గరుణాలవాలు, భాసుర కపోలుఁ,
గౌస్తుభాలంకారుఁ, గామితమందారు
సురుచిరలావణ్యు, సుర శరణ్యు
హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు
ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు,
ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ
బన్నగశయను, నబ్జాతనయను,
మకరకుండల సద్భూషు, మంజుభాషు
నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు,
భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు,
విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు.
ని (ఒక పట్టమహిషి మందిరంలో)
కుచేలుడు చూసినట్లు పోతన గారి వర్ణన.
మూలంలో ఇదేమీ లేదు.
తం విలోక్యాచ్యుతో దూరా
త్రియాపర్యంకమాస్థితః |
సహసోత్థాయ చాభ్యేత్య
దోర్భ్యాం పర్యగ్రహీన్ముదా॥
సఖ్యుః ప్రియస్య విప్రర్షే
రంగసంగాతినిర్వృతః |
ప్రీతో వ్యముంచదద్బిందూ
న్నేత్రాభ్యాం పుష్కరేక్షణః II
కృష్ణుడే దూరంనుండి కుచేలుని చూసి,
వెంటనే వచ్చి కౌగలించుకొని,
పారవశ్యాన్ని పొందాడు.
ఆయన పద్మనేత్రాలు
ఆనందబాష్పాలు స్రవించాయి.
ఇది పోతనకు పారవశ్యాన్ని కల్గించింది.
సహజభక్త్యావేశం కల్గినవాడు కావడంతో
ఒడలు మఱచి, శబ్దాలంకారాలు అందులోనూ అంత్యానుప్రాస అంటే మక్కువ ఎక్కువైన పోతన కృష్ణుని పైవిధంగా వర్ణించి తరించాడు.
(భాగవతంనిండా అంత్యానుప్రాసపద్యాలు వందలకొద్దీ ఉన్నాయి.)
ఇక ప్రస్తుతానికి వస్తే
తనకు విష్ణువనే పేరెలా వచ్చిందో స్వయంగా భగవానుడే చెప్పినట్లుగా భారతంలో ఉంది.
వ్యాప్య మే రోదసీ పార్థ!
కాన్తి రభ్యధికా స్థితా,
క్రమణా ద్వా ప్యహం పార్ధ!
విష్ణు రి త్యభిసంజ్ఞితః ” | '
నా కాంతి భూమ్యాకాశాలను
వ్యాపించి ఉండడం చేతా,
నేను సర్వత్రా వ్యాపించి ఉండడం చేతా, ‘విష్ణు' సంజ్ఞకలవాడనయ్యాను.
పై వచనం వలన పరమాత్మ,
'విష్ణు' శబ్దవ్యపదేశ్యు డని తెలుస్తోంది.
కాంతికలవాడు (స్వయంప్రభుడు) - రోచిష్ణుః
జయమే స్వభావంగా కలవాడు - జిష్ణుః
(శీతోష్ణాది) ద్వంద్వాలను సహించేవాడు కాబట్టి - సహిష్ణుః
వ్యాసుడు చెప్పిన ప్రకారం
కృష్ సత్తావాచకం.
ణ ఆనందవాచకం.
సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి - కృష్ణః.
మహాభారతంలో కృష్ణవర్ణం కలవాడను కాన కృష్ణుడ నయ్యానని పరమాత్మ స్వయంగా చెప్పాడు.
అటువంటి కృష్ణుని కుచేలుడు చూశాడు.
స్వస్తి
మంగళం మహత్