వాల్మీకి,
రామాయణంలో ఎక్కడా
ఇందువల్ల ఇలా జరిగింది.
అందువల్ల అలా జరిగింది
అని పేర్కొంటూ
ఏ సంఘటనా వ్రాయలేదు.
ఉన్నది ఉన్నట్లు జరిగిన కథను వ్రాశాడంతే.
అందువల్ల ఆయా ఘట్టాలు జరిగిన తర్వాత వాటిని అన్వయం చేసుకొంటూ వెళ్లగల్గితే కార్యకారణసంబంధాలు తెలుస్తాయి.
రామాయణవ్యాఖ్యాతలు కొందఱు
వాటిని వివరించారు.
సముద్రుడు మైనాకునితో
హనుమంతుడు వస్తున్న
విషయం గుఱించి చెప్పి
"సలిలాదూర్ధ్వముత్తిష్ఠ
తిష్టత్వేష కపిస్త్వయి,
అస్మాకమతిథి శ్చైవ
పూజ్యశ్చ ప్లవతాం వరః.
అతిథి అయిన ఈ హనుమంతుఁడు నీమీద నిలవడానికి వీలైనట్లు ఉదకంనుండి పైకి లే.
చామీకరమహానాభ
దేవగంధర్వ సేవిత,
హనుమాంస్త్వయి విశ్రాంత
స్తతః శేషం గమిష్యతి.
హనుమంతుడు నీపై కొంత సేపు విశ్రమించి, పిమ్మట, మిగిలిన దూరం ప్రయాణం చేయగలడు.
కాకుత్థ్సస్యానృశంస్యం చ
మైథిల్యాశ్చ నివాసనమ్,
శ్రమం చ ప్లవగేన్ద్రస్య
సమీక్ష్యోత్థాతుమర్హసి.
రాముని సాధుత్వాన్ని,
సీతయొక్క (లంకా) వాసాన్ని,
హనుమంతుని శ్రమను,
దృష్టిలో ఉంచుకొని పైకి లే " అని అన్నాడు.
(సముద్రుడు రామునిలో
సాధుత్వాన్ని చూశాడు.
ఇది గుర్తుపెట్టుకోండి)
అపుడు మైనాకుడు పైకి లేచి,
"తిష్ఠ త్వం హరిశార్దూల
మయి విశ్రమ్య గమ్యతామ్.
ఓ, వానరోత్తమా! ఆగి,
నా పై విశ్రమించి,
వెళ్ళు." అన్నాడు.
హనుమంతుడు సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగిపోయాడు.
దేవతాశ్చభవన్ హృష్టా
స్తత్రస్థాస్తస్య కర్మణా,
కాఞ్చనస్య సునాభస్య
సహస్రాక్షశ్చ వాసవః.
మైనాకుడుచేసిన ఈ పనికి,
అక్కడ ఉన్న దేవతలు, దేవేంద్రుడు కూడ
చాల సంతోషించారు.
ఇంద్రుడు సంతోషంతో గొంతు గద్గదం కాగా,
"హిరణ్యనాభ శైలేన్ద్ర
పరితుష్టోఽస్మి తే దృశమ్,
అభయం తే ప్రయచ్ఛామి
తిష్ఠ సౌమ్య యథాసుఖమ్.
ఓ మైనాకుడా। నీ విషయంలో చాల సంతోషించాను. నీకు అభయ మిస్తున్నాను. ఇటుపై సుఖంగా ఉండు."
అని వరం ఇచ్చాడు.
వాల్మీకి చెప్పకపోయినా,
మైనాకుని భయం తీరడానికి
సముద్రుడు చేసిన సాయం ఇది అని
ఇదంతా జరిగాక మనకు తెలుస్తుంది.
మైనాకునికి ఇంద్రుని భయం పోనంత
వఱకు తనలో ఉన్న మైనాకునివల్ల
తనకు కూడా ఇబ్బందే. ఇపుడు ఇద్దరికీ ఇబ్బందులు తీరాయి.
ఇది ఒక ఘట్టం.
తర్వాత రామాదులు ససైన్యంగా
సముద్రతీరానికి చేరారు.
తతః సాగరవేలాయాం
దర్భానాస్తీర్య రాఘవః,
అంజలిం ప్రాఙ్ముఖః కృత్వా
ప్రతిశిశ్యే మహోదధేః
బాహుం భుజఙ్గభోగాభ
ముపధాయారిసూదనః.
పిమ్మట రాముడు సముద్రతీరమందు
దర్భలు పరచుకొని సముద్రానికి నమస్కరించి, సర్పశరీరంలా ఉన్న బాహువును తలగడగా ఉంచుకొని ప్రాఙ్ముఖుడై శయనించాడు.
సత్రిరాత్రోషితస్తత్ర
నయజ్ఞో ధర్మవత్సలః,
ఉపాసత తదా రామః
సాగరం సరితాం పతిమ్.
నీతి, ధర్మం తెలిసిన రాముడు
అక్కడ మూడు దినాలు శయనించి
సముద్రుని ఉపాసించాడు.
న చ దర్శయతే రూపం
మందో రామస్య సాగరః,
ప్రయతేనాపి రామేణ
యథార్హమభిపూజితః,
ఆ విధంగా రాముడు నియమవంతుడై యథావిధిగా పూజించినా
మందుడైన సముద్రుడు దర్శనం ఇవ్వలేదు.
దాంతో రామునికి కోపం వచ్చింది.
విచిన్వన్నాభిజానాసి
పౌరుషం వాపి విక్రమమ్,
దానవాలయ సంతానం
మత్తో నామ గమిష్యసి.
సముద్రుడా! నీవు పరిశీలించి కూడా
నా పౌరుషపరాక్రమాల్ని గుర్తించలేకున్నావు.
నా వలన ఇప్పుడు సంతాపం పొందగలవు.
బ్రాహ్మేణాస్త్రేణ సంయోజ్య
బ్రహ్మదండనిభం శరమ్,
సంయోజ్య ధనుషి శ్రేష్ఠే
విచకర్ష మహాబలః
రాముడు, బ్రహ్మదండంతో సమానమైన
బాణాన్ని బ్రహ్మాస్త్రంతో కూర్చి,
ధనస్సునందు చేర్చి లాగాడు.
(భూమ్యాకాశాలు బ్రద్దలైనట్లయ్యాయి.
కొండలు కంపించాయి.)
సహసాభూత్తతో వేగా
ద్భీమవేగో మహోదధిః,
యోజనం వ్యతిచక్రామ
వేలామన్యత్ర సంప్లవాత్.
అప్పుడు మహాసముద్రం శీఘ్రంగా భయంకరమైన వేగం పొంది, ఆ వేగంవల్ల రామాదులున్న వైపునుండి ఒక యోజనం లోపలికి పోయింది.
తం తథా సమతిక్రాంతం
నాతిచక్రామ రాఘవః,
సముద్ధతమమిత్రఘ్న
రామో నదనదీపతిమ్
రాముడు ఆ విధంగా దూరానికి తొలగిన (పారిపోతున్న వానిపై బాణం వేస్తే ధర్మాన్ని అతిక్రమించినట్లవుతుంది. అందువల్ల) సముద్రునిపై బాణం వేయలేదు.
తతో మధ్యాత్సముద్రస్య
సాగరః స్వయముత్థితః
ఉదయం హి మహాశైలా
న్మేరోరివ దివాకరః.
అప్పుడు సముద్రంమధ్యనుండి సముద్రుడు, మేరుపర్వతంనుండి సూర్యుడు ఉదయించినట్లు స్వయంగా ఆవిర్భవించాడు.
రామునితో ఇలా అన్నాడు.
'పృథివీ వాయురాకాశ
మాపో జ్యోతిశ్చ రాఘవ
స్వభావే సౌమ్య తిష్ఠంతి
శాశ్వతం మార్గమాశ్రితాః
ఓ సౌమ్యా! రామా ! భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని శాశ్వతమార్గాన్ని అనుసరించి తమ స్వభావాన్ని దాటకుండా ఉంటాయి.
(ఇక్కడ సౌమ్య అనే విశేషణం గమనించండి)
తత్స్వభావో మమాప్యేష
యదగాధో హమఫ్లవః
వికారస్తు భవేద్గాధ
ఏతత్తే ప్రవదామ్యహమ్.
లోతుగా దాటశక్యం కాకుండ ఉండడం అనేది
నా స్వభావం. లోతు లేనివాడ నైతే అది నా స్వభావానికే విరుద్ధం. ఈ విషయం నీకు చెప్తున్నాను, విను.
న కామాన్న చ లోభాద్వా
న భయాత్పార్డివాత్మజ,
రాగాన్నక్రాకులజలం
స్తంభయేయం కథంచన.
రాజకుమారా ! మొసళ్లతో వ్యాకులంగా ఉండే జలాన్ని నేనెన్నడూ ఏదైనా కోరికవలన గాని, లోభంవలన గాని, భయంవలన గాని, ప్రేమవలన గాని స్తంభింపచేయను.
విధాస్యే యేనగంతాసి
విషహిష్యే హ్యహం తథా,
న గ్రాహా విధమిష్యన్తి
యావత్సేనా తరిష్యతి,
హరీణాం తరణే రామ
కరిష్యామి యథాస్థలమ్.
రామా! నీవు దాటటానికి వీలుగా నేను ఏర్పాటు చేస్తాను. స్థలాన్ని ఏర్పరచి సహించి ఉంటాను.
సేన దాటేవఱకు మొసళ్లు అపకారం చేయకుండా చేస్తాను."
( భయపెట్టినా సరే జలాన్ని స్తంభింపజేయనని,
తన సహజస్వభావానికి విరుద్ధంగా
లోతు తగ్గించడం అనేది కూడా కుదరదని
సముద్రుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు.
అన్యాపదేశంగా సేతుబంధనం కావించమని సూచిస్తున్నాడు.)
అప్పుడు రాముడు సముద్రునితో ఇలా అన్నాడు.
"అమోఘోఽయం మహాబాణః
కస్మిన్ దేశే నిపాత్యతామ్.
అమోఘమైన ఈ మహాబాణం వ్యర్థమవటానికి వీలు లేదు. దీన్ని ఎక్కడ ప్రయోగించను?"
గొప్పదైన ఆ బాణాన్ని చూసి, రామునితో
సముద్రుడు ఇలా అన్నాడు.
"ఉత్తరేణావకాశోఽస్తి
కశ్చిత్పుణ్యతరో మమ,
ద్రుమకుల్య ఇతి ఖ్యాతో
లోకే ఖ్యాతో యథా భవాన్.
నాకు, ఉత్తరంగా, ద్రుమకుల్యం అనే
మిక్కిలి పుణ్యతరమైన,
నీలాగే ప్రసిద్ధి పొందిన
ఒక ప్రదేశం ఉంది.
ఉగ్రదర్శనకర్మాణో
బహవస్తత్ర దస్యవః
ఆభీరప్రముఖాః పాపాః
పిబన్తి సలిలం మమ.
అక్కడ చూడ్డానికి భయంకరులు, ఉగ్రమైన పనులు చేసేవారు, పాపాత్ములైన ఆభీరులు మొదలైన దస్యువులు నా జలం త్రాగుతున్నారు.
తైర్న తత్స్పర్శనం పాపం
సహేయం పాపకర్మభిః,
అమోఘః క్రియతాం రామ
తత్ర తేషు శరోత్తమః.
రామా! ఆ పాపాత్ముల స్పర్శను సహించలేకున్నాను. ఈ శ్రేష్ఠమైన బాణాన్ని
ఆ ప్రదేశంలో వాళ్ల మీద ప్రయోగించు"
అపుడు రాముడు ఆ ప్రదేశం మీద బాణాన్ని ప్రయోగించాడు.
ఆ తర్వాత సముద్రుడు రామునితో
"అయం సౌమ్య నలో నామ
తనయో విశ్వకర్మణః,
పిత్రా దత్తవరః శ్రీమాన్
ప్రతిమో విశ్వకర్మణః.
ఏష సేతుం మహోత్సాహః
కరోతు మయి వానరః,
తమహం ధారయిష్యామి
యథాహ్యేష పితా తథా.
నలుడు విశ్వకర్మ కుమారుడు.
తండ్రి విశ్వకర్మతో సమానుడు.
మహోత్సాహవంతుడైన
ఈ వానరుడు నామీద నిర్మించిన
సేతువును నేను ధరిస్తాను.
నాకు ఇతని తండ్రి ఎంతో
ఇతడు కూడ అంతే."
అని చెప్పి అంతర్థానమయ్యాడు.
(పై రెండు శ్లోకాలు గమనించారుగా!
ఉత్సాహవంతుడు అనే నలుని విశేషణం.
సేతువు ఉత్సాహం సముద్రునిది.
విశ్వకర్మ ప్రతిభ తెల్సిన సముద్రుడు
నలుని నైపుణ్యాన్ని కూడా తెల్సుకోగోరుతున్నాడని అర్థమవుతుంది.)
ఇక్కడ సందేహం వస్తుంది.
— రామకార్యం అని చెప్పి భక్త్యాదరాలతో రాముని బంటునే మైనాకుని చేత సత్కరింపబూనిన సముద్రుడు మఱి మూడు రోజులు ఎందుకు ఆలసించాడు?
వివరణ — ప్ర్రార్థించినంత మాత్రానే ప్రసన్నుడై దర్శన మిచ్చి మార్గమిచ్చినట్లయితే
అందఱూ ఈ మార్గాన్నే అనుసరిస్తారు.
నీవు త్రోవ ఇత్తువా చత్తుమా అని ప్రాయోపవేశానికి దిగుతారు.
అలాంటి వ్యవహారానికి దారి చూపించినట్లవుతుంది.
ఇప్పుడో అంతటి రామచంద్రమూర్తికి సాధ్యంగానిది మన కవుతుందా అని విరమిస్తారు.
(రాముడు మానవుడని మఱచిపోరాదు.
ప్రాయోపవేశానికి దిగినంతనే సముద్రుడొస్తే తక్కిన మానవులకది ఆదర్శమవుతుందని తాత్పర్యం. అమోఘపరాక్రమంచేతనే సాధ్యమవ్వాలని సముద్రుడు లోకానికి నిరూపించడం కోసం ఆలసించాడు.)
ఇంకో కారణం.
ఈయనచేత తనకు శత్రువులైన ఆభీరులను చంపించాలి. అది రామచంద్రునకు తప్ప తక్కిన వారికి సాధ్యమయ్యేది కాదు.
కావున స్వామికార్యం స్వకార్యం రెండూ చక్కబడ్డంకోసం ఇంతవఱకు ఆలసించాడు.
అంతేతప్ప రామచంద్రమూర్తి మహిమ ఎఱుఁగక కాదు. రామచంద్రమూర్తి ఎంత కోపించినా నమస్కరిస్తే క్షమిస్తాడని (సౌమ్యుడన్నాడందుకే)
సముద్రునికి తెలుసు.
ఇంకో విషయం.
త్వరలో రామరావణులమధ్య ఘోరయుద్ధం జరుగబోతోంది. రాముని సాధుత్వం తెలుసు. మైనాకునితో చెప్పాడు. ఇక పరాక్రమం ఎలాంటిదో స్వయంగా చూడాలనిపించింది. దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అందుకే అడిగిన వెంటనే దర్శనం ఇవ్వక ఆలసించాడు.
సందేహం తీరి ఉంటుందని ఆశిస్తూ
స్వస్తి.
- ఈశ్వర్