19, జూన్ 2023, సోమవారం

తుని తగవు

 తుని తగవు: 

తూర్పుగోదావరి జిల్లాకు ఉత్తర సరిహద్దులోని ఊరు తుని.

 

తగవంటే న్యాయం, ధర్మం.

పోట్లాట కాదు.


వాడుకలో మాటలు కలిపి 'తుత్తగవు' అని కూడా పలుకుతారు.


ఇద్దరు వ్యక్తులు అప్పుసప్పుల గురించి, లావాదేవీల గురించి ఘర్షణ పడితే సంధి చేసే విధానాల్లో ఇదొకటి.


మాట వరుసకు ఒకరు పది రూపాయలు బాకీ వుందంటే, మరొకరు అయిదే తీసుకొన్నానంటే - సగటున ఏడున్నర రూపాయలిచ్చి తగాదా చంపుకొమ్మనటం తుత్తగవు. 


ఉభయపక్షాలకూ సమానంగా బాధ కలిగించటమే ఇందులోని పరమార్థం.


తగాదాను కొనసాగించకుండా చంపటం రెండో లక్ష్యం.


ఇలాంటి భావంతోనే "రామాయపట్నం మధ్యస్థం" లాంటి జాతీయాలు పుట్టాయి.


ఇలా ఎన్ని ఊళ్ల పేర్ల మీద ఇదే భావం చెప్పే జాతీయాలు పుట్టాయో లెక్కగట్టడం కష్టం.


~బూదరాజు రాధాకృష్ణ గారు 


“తూర్పుగోదావరిజిల్లాకున్ను విశాఖపట్నం జిల్లాకున్ను మధ్యస్థంగా తుని ఉంది. 

దాన్ని గోదావరి జిల్లాలో చేర్చడమా? విశాఖపట్నం జిల్లాలో చేర్చడమా? అనే తగవు ఒకటి సంభవించింది. చాలా కష్టమైన సమస్య అయింది. 

అటువంటి విభజనకు కష్టసాధ్యమైన  క్లిష్టసమస్యలకు తునితగవు సామ్యం అయింది."

~కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు 

8-7-1953 ఆంధ్రసచిత్రవారపత్రిక   

9, జూన్ 2023, శుక్రవారం

కావ్యం

"కావ్యం యశసేఽర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే 

సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే"


ముమ్మటుడు తన కావ్యప్రకాశంలో పైవిధంగా కావ్యప్రయోజనాలు చెప్పాడు.


కావ్యం యశస్సును కలిగిస్తుంది.

అర్థాన్ని(సంపద) సంపాదిస్తుంది. (సంపాదించి పెడుతుంది.)

వ్యవహారపరిజ్ఞానాన్ని కలిగిస్తుంది.

శివం(శుభం)కంటె ఇతరమైనది శివేతరం. ఆ శివేతరాన్ని క్షయింప చేస్తుంది.

విన్న వెంటనే పరమైన ఆనందాన్ని, కలిగిస్తుంది.

కాంతాసమ్మితమై అంటే కాంత (భార్య) చేసినట్లుగా లలితంగా, తీయగా ధర్మోపదేశం చేస్తుంది.


ప్రభుసమ్మితాలు-వేదాదిశాస్త్రాలు. 

రాజుతో సమానమైనవి. ప్రభువులా శాసిస్తాయి. ధర్మాలు విని, ఆచరించి తీరాలి.


మిత్రసమ్మితాలు-పురాణేతిహాసాలు. 

మిత్రునిలా బోధిస్తాయి. 'ఇలా చేస్తే ఈ ఫలితం. అలా చేస్తే ఆ ఫలితం' అని మిత్రునిలా చెప్తాయి. వింటే మేలు. 


కాంతాసమ్మితాలు-కావ్యాలు.

భర్తను స్వాధీనం చేసుకొన్న అనంతరం ఉపదేశం చేసే కాంతలాంటివి. సరసంగా ధర్మబోధ ఉంటుంది.


మంగళం మహత్ 

7, జూన్ 2023, బుధవారం

రాముని వంశక్రమం

 ప్రశ్న : రఘువంశం 2 వ సర్గలో కాళిదాసు దిలీపునికి నందిని వరం వలన రఘువు జన్మించినట్లుగా చెప్పాడు.

రామాయణం లో రాముని వివాహం సందర్బంగా Vashishtudu పైన చూపిన విధంగా చెప్పాడు. 

బుధులు ఇందులో ఏది సరి అయినదో వివరణ ఈయగలరు.

💐💐💐


దీని గుఱించి కొంత పరిశోధన చేయడం జరిగింది. అందువల్ల తేలినదేమంటే దీనికి సమాధానం ఊహించి చెప్పవలసిందే తప్ప వ్యాఖ్యాతలెవరూ వివరించినట్లు (నాగస్వరానికి అన్పించ)లేదు.

కవికులగురువు కాళిదాసు మీద భాసుని ప్రభావం ఎంతో ఉంది.

"ప్రథితయశసాం భాస సౌమిల్ల కవి పుత్రాదీనాం ప్రబంధానతిక్రమ్య వర్తమానకవేః కాళిదాసస్య    క్రియాయాం కథం బహుమానః”?"

అని కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో అన్నప్పటికీ యథార్థమైన విశేషణం వాడి మొదట భాసుని పేర్కొనడంవల్ల అతని మీద కాళిదాసుకు ఎంత అభిమానం ఉందో తెలియడమే కాక,  పై మాటలనుబట్టి భాసుడు చాల ప్రముఖకవిగా పరిగణింపబడినట్టు కూడా తెలుస్తున్నది. 

భాసుడు రామాయణకథను నాటకాలుగా వ్రాశాడు.

కాళిదాసు భాసుని ఆదర్శంగా తీసుకొని అనుకరించిన సందర్భాలున్నాయి.

ముఖ్యంగా భాసుని నాటక సన్నివేశాలను ఎన్నోచోట్ల అనుకరించాడు. 

ఇక రఘువంశకావ్యాన్ని కాళిదాసు ఒక ప్రణాళిక ప్రకారం రచించాడు.

రఘువంశంలో 19 సర్గలున్నాయి. రఘువంశ రాజుల్లో ప్రముఖమైనవారి చరిత్రను విశదంగాను, మిగతావారి చరిత్రను సంగ్రహంగాను వర్ణించి, మరీ అప్రధానమైన వారిని నామమాత్రంగా పేర్కొన్నాడు.

మొదటి 9 సర్గల్లో దిలీప, రఘు, అజ, దశరథుల చరిత్రలు, తర్వాత శ్రీరాముని చరిత్ర, చివరి నాలుగు సర్గల్లో కుశుడు మొదలు అగ్నివర్ణుని వఱకు గల 24 రాజుల చరిత్రలు వర్ణింపబడ్డాయి.

రఘువంశ రాజుల్లో దిలీప, రఘు, అజ, శ్రీరాముల చరిత్రలనే కాళిదాసు విశదంగా, ఉత్తమంగా చిత్రించాడు. 

వాల్మీకాదుల రచనలచేత ప్రేరేపితుడై కాళిదాసు రఘువంశాన్ని రచించాడని


"అథవా కృతవాగ్ద్వారే 

వంశేఽ స్మి న్పూర్వ సూరిభిః 

మణౌ వజ్రసముత్కీర్ణే

సూత్ర స్వే వాస్తి మేగతిః"


అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది.


అయితే ఎందుకో వాల్మీకిని పేరుతో ప్రస్తావించలేదు. 

(ప్రస్తావిస్తే దాని ప్రకారం వ్రాయాల్సి వస్తుందనేమో!)


అలాగే వాల్మీకి చెప్పిన ప్రకారం రాముని వంశక్రమాన్ని తీసుకోలేదు.

మఱి ఏమిటి ఆధారం? అని పరిశీలిస్తే 

భాసుని ప్రతిమా నాటకంలో ఆయన పేర్కొన్న రాముని వంశక్రమాన్ని కాళిదాసు అనుసరించాడని (నాగస్వరానికి) తెల్సింది.

దిలీపుడు, ఆయన కొడుకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడు, ఆయనకు రామాదులు అని భాసుడు పేర్కొన్నాడు. దాన్నే కాళిదాసు స్వీకరించాడు. 

ఎందుకు అంటే కవులు నిరంకుశులు. స్వేచ్ఛాప్రియులు. కల్పనాచతురులు. కాళిదాసుని వీరి చరిత్రలు ఆకర్షించాయి. 

దిలీపుని సేవాపరాయణత, రఘుమహారాజు దాన నిరతి, అజుని కోమల స్వభావం, శ్రీరాముని ఆదర్శజీవితం కవికి  సర్వోత్తమంగా అ/కన్పించాయి. ఒక అద్భుత చమత్కారాన్ని సాధించడంకోసం కూడా మార్పు చేశాడనవచ్చు. అలాగే జరిగి అఖండఖ్యాతి నార్జించింది రఘువంశకావ్యం.

అందువల్ల తనకు ఆదర్శమైన భాసుడెలాగా ఒక క్రమాన్ని ఏర్పాటు చేసిపెట్టాడు కదా!

అందువల్ల దాన్ని అనుసరించాడని (నాగస్వరానికి)  అన్పించింది. పైగా ఒకరకంగా వంశక్రమాన్ని అనుసరించాడుగా! అంటే రామాయణం ప్రకారం దిలీపునకు రఘువు కొడుకు కాకపోయినా, వరుసను బట్టి చూస్తే, ఆయన తర్వాత రఘువే వస్తాడు.

ఇక ఏది సరైనది అని అడిగారు.

శకుంతల కథను నాటకంగా రచించిన కాళిదాసు దాన్ని మహాభారతం నుండి స్వీకరించాడు.

మహాభారతంలో దుష్యంతుడు కావాలనే శకుంతలను అవాయిడ్ చేశాడు.

హీరో ఉదాత్తుడై ఉండాలని కాళిదాసు అంగుళీయకాన్ని అభిజ్ఞానంగా కల్పించాడు.

ఇపుడు మహాభారతం కథ సరైనదా?

అభిజ్ఞాన శాకుంతలం కథ సరైనదా?

అంటే, మహాభారతంలోని శకుంతల కథే సరైనది.


అలాగే వాల్మీకి రామాయణమే రాముని వంశక్రమానికి ప్రమాణం.


మంగళం మహత్ 


2, జూన్ 2023, శుక్రవారం

గిరిక సంగీతనైపుణ్యం

పద మెత్తం గలహంసలీల యధర స్పందంబు సేయన్ శుభా 

స్పద మౌ రాగకదంబకంబు శ్రుతి చూపన్ శ్రీవిలాసంబు కే

ల్గదలింపన్ సుకుమారపల్లవనవైలాలక్ష్మి వీక్షింప ష

ట్పదియుం బొల్చుఁ దరంబె కన్నెఁ గొనియాడన్ గేయవాక్ఫ్రౌఢిమన్. వసు.చ.3.59


గిరిక పదం (అడుగు) ఎత్తగానే రాజహంసనడక

పదం (మాతు=సంగీతంతో కూడిన సాహిత్యం) ఎత్తగానే కలహంసరాగం

(కలహంస అంటే హంసధ్వని కాదు.)

కలహంస ఒక రాగం. 31వ మేళకర్త యాగప్రియరాగజన్యం.

కలహంసప్రబంధమనే పేరుతో ఒక గీతికాభేదం ఉంది.( ఒకరకమైన పాట.) కాబట్టి అది కూడా చెప్పవచ్చు.


అధరస్పందం చేయగానే (పలుకగానే) మంగళాశ్రయమైన అరుణకాంతిసమూహం. 

(అధరం కదపగానే ఎఱుపు కన్పిస్తుందని.)

అధరస్పందం చేయగానే రాగకదంబకంబనే ప్రబంధం. ఇది మఱొక గీతికాభేదం.

లేదా రాగమాలికలు బయలుదేరుతాయి.

(కదంబకం అంటే గుంపు. దీన్ని కదంబంగా పొరపాటు పడి, కడిమిపూల యెఱ్ఱదనం అని భావించరాదు.)


శ్రుతి (చెవి) చూపగానే శ్రీకార(శ్రీవర్ణలిపి)విలాసం.

శ్రుతి సవరింపగానే శ్రీరాగం.

శ్రీరాగం చాల ప్రాచీన రాగం. ఘనరాగాల్లో ఒకటి. లేదా గీతికావిశేషమైన శ్రీవిలాస ప్రబంధం.


చేయి కదపగానే సుకుమార పల్లవయుత ఏలకి తీగల శోభ.

చేయి కదపగానే సుకుమార పల్లవహస్తంతో కూడిన ఏలా అనే పేరుగల గీతప్రబంధం.


చూడగానే ఆడుతుమ్మెద స్ఫురిస్తుంది. 

చూడగానే షట్పది అనే గీతవిశేషం.


ఆమెను కొనియాడడం శక్యం కాదని అవయవచాలనాదులవల్లనే గిరిక గానసమృద్ధి కన్పిస్తోందని వర్ణించాడు సంగీతకవి రామరాజభూషణుడు. 


మంగళం మహత్