7, జూన్ 2023, బుధవారం

రాముని వంశక్రమం

 ప్రశ్న : రఘువంశం 2 వ సర్గలో కాళిదాసు దిలీపునికి నందిని వరం వలన రఘువు జన్మించినట్లుగా చెప్పాడు.

రామాయణం లో రాముని వివాహం సందర్బంగా Vashishtudu పైన చూపిన విధంగా చెప్పాడు. 

బుధులు ఇందులో ఏది సరి అయినదో వివరణ ఈయగలరు.

💐💐💐


దీని గుఱించి కొంత పరిశోధన చేయడం జరిగింది. అందువల్ల తేలినదేమంటే దీనికి సమాధానం ఊహించి చెప్పవలసిందే తప్ప వ్యాఖ్యాతలెవరూ వివరించినట్లు (నాగస్వరానికి అన్పించ)లేదు.

కవికులగురువు కాళిదాసు మీద భాసుని ప్రభావం ఎంతో ఉంది.

"ప్రథితయశసాం భాస సౌమిల్ల కవి పుత్రాదీనాం ప్రబంధానతిక్రమ్య వర్తమానకవేః కాళిదాసస్య    క్రియాయాం కథం బహుమానః”?"

అని కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో అన్నప్పటికీ యథార్థమైన విశేషణం వాడి మొదట భాసుని పేర్కొనడంవల్ల అతని మీద కాళిదాసుకు ఎంత అభిమానం ఉందో తెలియడమే కాక,  పై మాటలనుబట్టి భాసుడు చాల ప్రముఖకవిగా పరిగణింపబడినట్టు కూడా తెలుస్తున్నది. 

భాసుడు రామాయణకథను నాటకాలుగా వ్రాశాడు.

కాళిదాసు భాసుని ఆదర్శంగా తీసుకొని అనుకరించిన సందర్భాలున్నాయి.

ముఖ్యంగా భాసుని నాటక సన్నివేశాలను ఎన్నోచోట్ల అనుకరించాడు. 

ఇక రఘువంశకావ్యాన్ని కాళిదాసు ఒక ప్రణాళిక ప్రకారం రచించాడు.

రఘువంశంలో 19 సర్గలున్నాయి. రఘువంశ రాజుల్లో ప్రముఖమైనవారి చరిత్రను విశదంగాను, మిగతావారి చరిత్రను సంగ్రహంగాను వర్ణించి, మరీ అప్రధానమైన వారిని నామమాత్రంగా పేర్కొన్నాడు.

మొదటి 9 సర్గల్లో దిలీప, రఘు, అజ, దశరథుల చరిత్రలు, తర్వాత శ్రీరాముని చరిత్ర, చివరి నాలుగు సర్గల్లో కుశుడు మొదలు అగ్నివర్ణుని వఱకు గల 24 రాజుల చరిత్రలు వర్ణింపబడ్డాయి.

రఘువంశ రాజుల్లో దిలీప, రఘు, అజ, శ్రీరాముల చరిత్రలనే కాళిదాసు విశదంగా, ఉత్తమంగా చిత్రించాడు. 

వాల్మీకాదుల రచనలచేత ప్రేరేపితుడై కాళిదాసు రఘువంశాన్ని రచించాడని


"అథవా కృతవాగ్ద్వారే 

వంశేఽ స్మి న్పూర్వ సూరిభిః 

మణౌ వజ్రసముత్కీర్ణే

సూత్ర స్వే వాస్తి మేగతిః"


అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది.


అయితే ఎందుకో వాల్మీకిని పేరుతో ప్రస్తావించలేదు. 

(ప్రస్తావిస్తే దాని ప్రకారం వ్రాయాల్సి వస్తుందనేమో!)


అలాగే వాల్మీకి చెప్పిన ప్రకారం రాముని వంశక్రమాన్ని తీసుకోలేదు.

మఱి ఏమిటి ఆధారం? అని పరిశీలిస్తే 

భాసుని ప్రతిమా నాటకంలో ఆయన పేర్కొన్న రాముని వంశక్రమాన్ని కాళిదాసు అనుసరించాడని (నాగస్వరానికి) తెల్సింది.

దిలీపుడు, ఆయన కొడుకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడు, ఆయనకు రామాదులు అని భాసుడు పేర్కొన్నాడు. దాన్నే కాళిదాసు స్వీకరించాడు. 

ఎందుకు అంటే కవులు నిరంకుశులు. స్వేచ్ఛాప్రియులు. కల్పనాచతురులు. కాళిదాసుని వీరి చరిత్రలు ఆకర్షించాయి. 

దిలీపుని సేవాపరాయణత, రఘుమహారాజు దాన నిరతి, అజుని కోమల స్వభావం, శ్రీరాముని ఆదర్శజీవితం కవికి  సర్వోత్తమంగా అ/కన్పించాయి. ఒక అద్భుత చమత్కారాన్ని సాధించడంకోసం కూడా మార్పు చేశాడనవచ్చు. అలాగే జరిగి అఖండఖ్యాతి నార్జించింది రఘువంశకావ్యం.

అందువల్ల తనకు ఆదర్శమైన భాసుడెలాగా ఒక క్రమాన్ని ఏర్పాటు చేసిపెట్టాడు కదా!

అందువల్ల దాన్ని అనుసరించాడని (నాగస్వరానికి)  అన్పించింది. పైగా ఒకరకంగా వంశక్రమాన్ని అనుసరించాడుగా! అంటే రామాయణం ప్రకారం దిలీపునకు రఘువు కొడుకు కాకపోయినా, వరుసను బట్టి చూస్తే, ఆయన తర్వాత రఘువే వస్తాడు.

ఇక ఏది సరైనది అని అడిగారు.

శకుంతల కథను నాటకంగా రచించిన కాళిదాసు దాన్ని మహాభారతం నుండి స్వీకరించాడు.

మహాభారతంలో దుష్యంతుడు కావాలనే శకుంతలను అవాయిడ్ చేశాడు.

హీరో ఉదాత్తుడై ఉండాలని కాళిదాసు అంగుళీయకాన్ని అభిజ్ఞానంగా కల్పించాడు.

ఇపుడు మహాభారతం కథ సరైనదా?

అభిజ్ఞాన శాకుంతలం కథ సరైనదా?

అంటే, మహాభారతంలోని శకుంతల కథే సరైనది.


అలాగే వాల్మీకి రామాయణమే రాముని వంశక్రమానికి ప్రమాణం.


మంగళం మహత్ 


కామెంట్‌లు లేవు: