29, జులై 2023, శనివారం

తెలుగు

 తెలుగు ఇపుడు కొత్తగా పాడైంది ఏం లేదు. తెలుగు వైభవం అర్థమవడానికి సంస్కృత శ్లోకాల అభ్యసన అవసరం అంటే దీనికి కారణం ఎవరు? అచ్చతెనుగు కావ్యాదులు ప్రాచీనులవి సుమారు పది పదిహేనుకి మించి లేవు. మిగిలినవన్నీ మణిప్రవాళశైలి పేరుతో తత్సమపదాలు నిండిపోయిన కావ్యాలే. దీనికి ఎవరు కారణం? తత్సమపదాలుగా తెలుగులోకి తెచ్చి తెలుగును మర్చిపోయేలా చేసిందెవరు?  భాషాప్రవీణ, తెలుగు ఎమ్.ఏ లో సంస్కృతం ఒక పేపర్‌గా ఉందంటే ఎందుకు? 


సగానికి పైగా ఆంగ్ల పదాలను ఉపయోగిస్తే ఎలా అన్నారు .? 

మఱి 90% సంస్కృత పదాలు వాడుతున్నాం మనం. ఇంకో 9% అన్యభాషాపదాలు. తెలుగు కున్న "ఆదాన" దీనత్వం ఇతరభాషలకున్న "ప్రదాన" జులుం తెలుగు కళ తప్పడానికి కారణం. 11వ శతాబ్దం నుండే తెలుగు నాశనానికి బీజం పడింది. శివకవులు, అన్నమయ్య, తిక్కన, తదితర నలుగురైదుగురు తెలుగులో రచనలు చేశారు. నిజానికి తెలుగును బ్రతికించింది వారే. కానీ బలం చాలలేదు. 


కంప్యూటర్ ‌కు సంబంధించిన పదాలన్నీ ఇంగ్లీషే. వాటిని అలాగే వాడడం ఉత్తమం పోని ఇతరభాషాపదాలను తెలుగులో మార్చడం అన్న పేరుతో చేసింది ఏమిటి? అవేమీ తెలుగు పదాలే కావు. సంస్కృత పదాలే . ఇంటర్నెట్ కి తెలుగు అంతర్జాలమా ? ఈ పదంలో తెలుగు ఏది? తెలుగు లిపిలో వ్రాస్తే తెలుగయిపోతుందా.? 

మీ వ్యాసంలో 20 సంస్కృత పదాలే ఉన్నాయి. ఆంగ్లమూ ఉంది. 


నా ఈ మెసేజ్ లోనూ ఉన్నాయి. తప్పదు. మార్పులు లేకపోతే చచ్చిన భాష అని సిద్దాంతం చేసేశారు మఱి.


36 తెలుగు అక్షరాలకు 19 అక్షరాలు కలిపి, సూరి వ్యాకరణం వ్రాయవలసివచ్చింది అంటేనే తెలుగుకు ఎన్ని పదాలు వచ్చి కలసిపోయాయో గ్రహించగలరు. దానికి తోడు వ్యవహారభాషోద్యమం కలిసింది. వ్రాసేది కాస్తా రాసేదైంది. దాని మీద జోక్ కూడా కొత్త 9 ఉపవాచకంలో ఉంది. 


సూర్యారాయాంధ్రనిఘంటువును మహాపండితులు కూర్చారు. వారు పీఠికలో చెప్పిన విషయాలు పరిశీలనార్హం.

"తెలుఁగుశబ్దముల రూపములు నర్థములు నిర్ణయించుటకుఁ గొంతవఱకు వ్యావహారిక భాషయుఁ జాలవఱకు వాఙ్మయమును(కొంతమందైనా తెలుగులో రచనలు చెయ్యడం వల్ల) నాధారములు. ఇందునకై వాఙ్మయమంతయుఁ క్రొత్తగాఁజదివి యర్థసహితముగా నొక్కొక్కశబ్ద మొక్కొక్క కాగితపుముక్క మీఁద నెత్తి వ్రాసి పిదప నీముక్కల నన్నింటిని గలిపి యక్షరక్రమముగా విభజనముచేసి యర్థాదులను రెండుమూఁడుతడవలు పరిశీలించి నిర్ణయించుటయైనది. ఈవిషయములో సాధ్యమయినంత వఱకుఁ బ్రమాదములు లేకుండఁ జేయవలయు నను నూహతో నీవిషయములో నధిక శ్రమము పడవలసివచ్చినది." అన్నారు. అప్పటి తెలుగుపండితులైన వారికే తెలుగు విషయంలో అంత కష్టపడవలసిన అవసరం వచ్చిందంటే అచ్చతెనుగును తెలుగు కవులు నిరాదరణ చేయడమే కారణం అని చెప్పాలి.  దీనికి బాధపడాలి.


అటజని కాంచె వఱకే తెలుగు. మిగిలినదంతా సంస్కృతమే. దీన్ని బట్టీ పడితే సంస్కృతం బాగా వస్తుందంతే.


అందువల్ల పద్యాల్లోనూ పాఠాల్లోనూ తెలుగు అక్కడక్కడా ఉంది. దానికి బాధపడాలి మనం.


అచ్చతెనుగు రచనలు ఎక్కువగా లేనందుకు ఉన్నవైనా పాఠ్యాంశాలుగా రానందుకు చింతించాలి మనం. 


అలాగని ప్రస్తుతవిషయానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.

తెలుగు పరిస్థితి చెప్పా. విజ్ఞులు విజ్ఞప్తులు పంపారు కదా! సానుకూల నిర్ణయం వస్తుందనే ఆశిద్దాం.


స్వస్తి

కామెంట్‌లు లేవు: