కృష్ణమ్ వన్దే జగద్గురుమ్
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
వాగ్విదాంవరులకు వందనాలు
సందేహం:
సూ. కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.
పల్లె + ఊరు
మొదటి పదం లో హ్రస్వ ఉకారం ఉందా? తెలియజేయగలరు .
తేనె + ఈగ కూడా...
వివరణ:
నిజమే. ఉత్తు లేదు. కానీ టుగాగమం వచ్చింది.
పాఠశాల,కళాశాలలకోసం రచింపబడిన అన్ని ఆధునిక వ్యాకరణాల్లోనూ
ఇదే సూత్రాన్ని పేర్కొంటున్నారు.
టుగాగమము సాధారణముగా ఉకారాంతపదములకు విధింపబడినదైనను
దుక్కిటెద్దు,మిద్దెటిల్లు ఇత్యాదులయందును ప్రవర్తిల్లుచున్నది (శ.ర.)
ఆలాగునే
పల్లెటూరు,తేనెటీఁగ,పడుకటిల్లు ఇత్యాది ఉకారాంత వ్యతిరిక్త స్థలాల్లోనూ కనబడుతోంది.
అలాగే వేల్పుటావు వంటి కర్మధారయేతర సమాసాల్లోనూ కనబడుతోంది.
అందువల్లే ’కర్మధారయంబులందు" అని సూరి బహువచనప్రయోగం చేశాడని వ్యాకరణవ్యాఖ్యాతలంటారు.
తేనెటీఁగ - తేనెయీఁగ - తేనీఁగ
ఇది ఎదంత శబ్దమైనా ఉదంతాలకులాగ దీనికీ “టు” గాగమం వచ్చింది...
కాని తేనెటీఁగ అనేదాన్నిఆంధ్రభాషార్ణవం సైతం పేర్కొనలేదు.
దుక్కిటెద్దు అన్నది నీలాసుందరీపరియణంలో, వేంకటనాథుని పంచతంత్రంలో కనబడుతోంది.
వజ్ఝల మొదలైన ప్రామాణిక వైయాకరణులు మాత్రం
’ఇవి వ్యావహారిక శబ్దాలు.
ఇలాంటివాటికి నిరాధారంగా కోశకర్తలు గ్రాంథికతను అంగీకరించడం యుక్తం అని తోచదు.
ప్రామాణిక ప్రయోగం గాని,ప్రామాణిక వైయాకరణవచనప్రామాణ్యంగాని లేనపుడు
వ్యావహారికశబ్దాలకు గ్రాంధికతను అంగీకరించడం సంప్రదాయవిరుద్ధం" అని అంటారు.
అందుకే ప్రయోగశరణం వ్యాకరణం అని ఉన్నా పల్లెటూరిత్యాదుల్నిసూరి పేర్కొనలేదు.
అంతేకాదు.
"ప్రాతాది" సూత్రాలకు కూడా సాధ్యం కావని ఎంచి సూరి
"నిక్కలాదులు యథాప్రయోగంబుగ గ్రాహ్యంబులు"
అనే సందర్భంలో చెప్పిన ఉదాహరణలు సైతం భారతంలోని ప్రామాణిక ప్రయోగాలే.
పోనీ అని
పల్లెటూరిత్యాదుల్ని లక్షణబద్ధం చేయాలంటే
ప్రామాణిక ప్రయోగాలు లేవాయె. అరుదుగా కనిపించేవి ఇవి.
(వంతరాం రామకృష్ణారావు గారు తన ముక్తలక్షణ కౌముదిలో శ్రీనాథుని చాటువుగా చెప్పే
పల్లెనాటి సీమ పల్లెటూళ్లు అని ఉదాహరించి,
"ఉదంతేతరంబుల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు గొండొకచోఁ జూపట్టెడి"
అని సూత్రం వ్రాశారు.
దుక్కిటెద్దు ఇంకో ఉదాహరణ.
కానీ కర్మధారయంబుల అని లేదు.
తర్వాత చాటువులు ప్రమాణాలు కావు.
దుక్కియెద్దు , తేనెయీగ అని వ్రాసినా యతిప్రాసలకు భంగం రాదు అని వజ్ఝలవారన్నారు.
తేనెటీగ వేమన వాడాడు.)
దీని తర్వాత సూరి చెప్పిన
“కర్మధారయంబునందుఁ బేర్వాదిశబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాష నగు”.
అనే సూత్రం లోని విభాషను వ్యవస్థ చేసి, పల్లెటూరిత్యాదుల సాధించుట ఉచితమని తోచెడి.
అని దూసివారు అంటారు.
ఏతావాతా తేల్చేది ఏమిటంటే
ప్రస్తుతానికి యథాతథం గ్రాహ్యం.
మంగళం మహత్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి