18, డిసెంబర్ 2022, ఆదివారం

శ్రీనాథుని కవిత్వం

శ్రీనాథుని కవిత్వం ప్రాచీనాంధ్రమహాకవుల విశిష్టకవితాగుణాలకు సంగమతీర్థ మని వేమారెడ్డి కాశీఖండంలో కీర్తించాడు. శ్రీనాథుని కవితాలక్షణాల్ని చక్కగా గుర్తించాడాయన. 'వచియింతు వేములవాడ భీమన భంగి నుద్దండ లీల నొక్కొక్కమాటు భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగ నొక్కొక్కమాటు పరిఢఁవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ, సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు' శ్రీనాథు డొక్కొకసారి వేములవాడ భీమకవి లాగా ఉద్దండంగా కవిత్వం చెపుతాడు. అంటే మిక్కుటంగా, దీర్ఘంగా చెపుతాడని. దీర్ఘ సమాసాల్లో ప్రగల్భంగా భావాన్ని చెప్పే పద్ధతి ఇది. "ఆడెం దాండవ మార్భటీ పటహ లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ముల్లసిల్ల గరళ గ్రీవుండు జాటాటవీ క్రోడాఘాట కరోటి కోటర కుటీ కోటీ లుఠచ్ఛిందు వీ చీ డోలాపటలీ పరిస్ఫుటతర స్ఫీత ధ్వని ప్రౌఢిమన్." -భీమే.పురా. ఒక్కొక సారి నన్నయభట్టులాగా సంస్కృతాంధ్ర శబ్దప్రయోగ ప్రౌఢి ప్రదర్శిస్తాడు. దీనివలన గీర్వాణాంధ్రశబ్దసంఘటన సామర్థ్యం వ్యక్తమౌతుంది. శుద్ధసాంస్కృతికమూ కాదు. శుద్ధదేశీయమూ కాదు. ఉభయప్రాధాన్యం కలది. మార్గరీతి అన్నమాట. నన్నయ రాజకులైకభూషణుడు పద్యాన్ని అనుసరిస్తూ,👇 రాజశశాంక శేఖరుడు రాజ కిరీటవతంస మష్టది గ్రాజ మనోభయంకరుఁడు రాజుల దేవర రాజరాజు శ్రీ రాజమహేంద్ర భూభువన రాజ్య రమా రమణీ మనోహరుం డాజి గిరీటి కీర్తి నిధి యల్లయవీర నరేంద్రుఁ డున్నతిన్ -కాశీ.ఖం. ధూర్దండ ఘట్టన త్రుటిత గ్రహగ్రాహ ధూళిపాళీమిళద్ద్యు స్థ్సలములు ధ్వజ పట పల్ల వోద్ధత మరుత్సంపాత, పరికంపమానోడు పరివృఢములు గ్రాసాభిలాషాను గత విధుంతుదపునః ప్రాప్తచక్ర వ్యథోపద్రవములు శ్రాంతాశ్వనిబిడనిశ్శ్వాసధారోద్దుర, స్వర్ధునీ నిర్ఘర జలధరములు గగన పదలంఘనైన జంఘాలికములు, పద్మబాంధవ నిజరథ ప్రస్థితములు సాఁగెనని దక్షిణాయన సమయమగుట, దర్దురము మీఁద మలయభూధరము మీద -కాశీ.ఖం. 👆ఇందులో భీమకవి ఉద్దండలీల, నన్నయ ఉభయవాక్ప్రౌఢి రెండూ కనబడతాయి. సమాసఘటనం, శబ్దశక్తిజ్ఞానం ఉన్నప్పటికీ కవికి రసాభివ్యక్తే ముఖ్యం. రసాభివ్యంజకకావ్యబంధాన్ని సాధించిన తిక్కన వాక్పాకాన్ని పుక్కిట పడతాడు శ్రీనాథుడు ఒక్కొక్కసారి. తిక్కన 'ఉర్వీధరంబుల' పద్యాన్ని అనుసరిస్తూ, "చిఱుసానఁ బట్టించి చికిలిసేయించిన, గండ్రగొడ్డలి నిశాగహనలతకుఁ గార్కొన్న నిబిడాంధకారధారాచ్చటా, సత్ప్రవాటికి వీతిహోత్ర జిహ్వ నక్షత్ర కుముద కాననము గిల్లెడు బోటి, ప్రాచినె త్తిన హస్తపల్ల వాగ్ర మరసి మింటికి మంటి కైక్య సందేహంబుఁ, బరిహరింపంగఁ బాల్పడ్డ యవధి సృష్టి కట్టెఱ్ఱ తొలుసంజ చెలిమికాడు, కుంటు వినతా మహాదేవి కొడుకుఁ గుఱ్ఱ సవితృ సారథి కట్టెఱ్ఱ చాయఁదెలుప, నరుణుఁడుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున." -కాశీ.ఖం. ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన్న రచనలో ఉక్తిని అలంకృతం చేయడంలో సహజత్వాన్ని వీడని ఒక చమత్కారాన్ని కల్పించే వైచిత్రి రాణిస్తుంది. దాన్ని శ్రీనాథుడు చేపట్టి ఒక్కొకసారి రక్తికట్టిస్తాడు. ఎఱ్ఱన రామాయణ పద్యాన్ని అనుసరిస్తూ, 'కందక గాజువాఱక వికాసము డిందక మందహాస ని ష్యందము చెక్కుటద్దముల నారక నెమ్మది నిద్రపోవు న ట్లందము నొందె ధాత్రి సిరియాల కుమారుని వక్తచంద్రుఁడా నందము నొందె నప్పు డెలనాగ మనంబును భర్తచిత్తమున్ -హర.విలా. కాలకంఠకఠోర కంఠహుంకారంబు, చెవులు సోకనినాఁటి చిత్తభవుఁడు కుపితరాఘవఘన క్రూర నారాచంబు, తనువు నాటని నాఁటి వనధిరాజు క్రుద్ధకుంభోద్భవ భ్రూలతా కౌటిల్య, వికృతిఁ గ్రుంగని నాఁటి వింధ్యశిఖరి వీరభద్రోదార ఘోర వీరావేశ, విహతిఁ గందని నాఁటి తుహినకరుఁడు చక్కఁదనమున గాంభీర్య సారమునను, బ్రకట ధైర్యకళా కలాపములయందు దండనాయక చూడా వతంస మైన, మంత్రి మామిడి వేమనామాత్యుఁ డెలమి. -శృం.నై.. 👆ఈ పద్యంలో పైన చెప్పిన ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచితబంధం, సూక్తి వైచిత్రి అనే నాలుగు గుణాలూ కనబడతాయి. కానీ, అవన్నీ నీరక్షీరన్యాయంగా కలిసిపోయి ఒక విశిష్టసృష్టి ప్రత్యక్ష మౌతున్నది. ఎన్నో పూలతేనెలు ఈ జుంటితేనెలో ఉన్నాయి. కానీ ఈ పాకం మాత్రం శ్రీనాథుడనే తేనెటీగదే. పూర్వకవుల ప్రసిద్ధ ఫణుతులను అదనెరిగి కవితలో కదను త్రొక్కించినా తనదైన ఒక అపూర్వమార్గాన్ని దుర్గమంగా నిర్మించుకొని భావికవితరాలకు బాటలుచూపించిన ప్రతిభాశాలి శ్రీనాథుడు. పండితుల రచనల ఆధారంగా... మంగళం మహత్

కామెంట్‌లు లేవు: