31, డిసెంబర్ 2022, శనివారం

రామాయణంలో ఒక విషయపరిశీలన

 భరతలక్ష్మణులలో జ్యేష్ఠుడెవరన్నదానికి


భరతుడే జ్యేష్ఠుడని 

భవభూతితో సహా అర్వాచీనులు పెక్కుమంది అభిమానించారు.


మఱి 

రామలక్ష్మణభరతశత్రుఘ్నులనే

వాడుక రావడానికి ఏమైనా కారణాలున్నాయా 

అని నేను పరిశీలించిన మీదట 

నాకు కొన్ని విషయాలు తెలిశాయి.


భాసుడు...

సంస్కృతంలో మొదటి నాటకకారుడు. 

కాళిదాసు నాటికి ప్రసిద్ధ నాటకకారుల్లో ఒకడుగా పేరు సంపాదించినవాడు. 


భాసుడు రామాయణ కథనంతా నాటకాల్లో కూర్చటానికి ప్రయత్నిస్తూ ప్రతిమా, అభిషేక నాటకాలను వ్రాశాడు. 


ఈ రెండు నాటకాల్లో ప్రతిమానాటకం నాటకకళాదృష్టితో వికసితమైన 

ప్రౌఢనాటకం. దీనిలో భాసుడు 

తన కల్పనాచాతుర్యాన్ని చూపుతూ అద్భుతమైన కథా సన్నివేశాలను  సృష్టించాడు. పాత్ర చిత్రణ కళాదృష్టితోనూ ఈ నాటకం ఉత్తమమైంది.


వాల్మీకి రామాయణానికీ, 

ఈ నాటకకథకూ 

కొన్ని భేదాలు  కనిపిస్తాయి.


అట్టి దొక్కటి : ఇందులో 

లక్ష్మణుడు పెద్దవాడుగాను, 

భరతుడు చిన్నవాడుగాను కనిపిస్తారు. లక్ష్మణుడు భరతుని ‘వత్స!' అని పిలుస్తాడు. ఆశీర్వదిస్తాడు.


భరతుడు లక్ష్మణునకు మ్రొక్కుతాడు. 'ఆర్య!' అని పిలుస్తాడు.


ఈ విషయం వాల్మీకి రామాయణంలో సంశయగ్రస్తంగా ఉంది.


బాలకాండలో: 

"పుష్యే జాతస్తు భరతః 

సార్పే జాతౌ తు సౌమిత్రీ-" అని ఉంది.


భరతుడు పుష్యమీ నక్షత్రాన, లక్ష్మణశత్రుఘ్ను లాశ్లేషా నక్షత్రాన 

జన్మించారు.


కాబట్టి భరతుడే జ్యేష్ఠుడవుతాడు. 

కాని, దీనికి విరుద్ధంగా 

లక్ష్మణుడే జ్యేష్ఠుడవుతా డనడానికి 

కూడా సాధనాలు కొన్ని 

రామాయణంలో ఉన్నాయి.


యుద్ధకాండలో:


"తతో లక్ష్మణ మాసాద్య

వైదేహీం చాభ్యవాదయత్,

అభివాద్య తతః ప్రీతో 

భరతో నామ చాఽబ్రవీత్"


అని ఉంది.

సరళరీతిని చూస్తే

ఇక్కడ భరతుడు, 

లక్ష్మణుని, సీతను 

నమస్కరించినట్లు అర్థం ఏర్పడుతుంది.

ఇలా చెప్తేనే ‘వైదేహీం చ’ అని అనడం 

సమర్థ మవుతుంది. 


జన్మకాలాన్నిబట్టి భరతజ్యైష్ఠ్యం 

వ్యక్త మవుతూండడంవల్ల

రామాయణవ్యాఖ్యాతలు ఇక్కడ చిక్కుపడ్డారు.


గోవిందరాజు 

దీని గుఱించి వ్యాఖ్యానిస్తూ, 

లక్ష్మణ మాసాద్య =  కృతనమస్కారం లక్ష్మణ మాలింగనేన సంభావ్య,

(లక్ష్మణునిచేత నమస్కరింపబడి, 

ఆతనిని ఆలింగనంతో సంభావించి,)

వైదేహికి (రామునితో సహా) నమస్కరించాడు. 

చకారం రామనమస్కారాన్ని 

సూచిస్తుంది" అని వ్రాశాడు.


ఇక్కడ చ యొక్క ఉపయోగం కనబడుతుంది. 


ఇంకా గోవిందరాజు 

అయోధ్యకాండలోని

"సీతా గచ్ఛత్వ మగ్రతో భరతాగ్రజః" అనే

వాల్మీకి రామాయణప్రయోగం 

సరళరీతిలో లక్ష్మణుడే జ్యేష్ఠుడని చెప్తున్నా, 

జన్మకాలరీతికి విరుద్ధం అవడం చేత

'భరతాగ్రజః ఇత్యత్ర బహువ్రీహి రిత్యుక్తమ్' అని క్లిష్టార్థాన్ని కల్పించాడు.


భరతునకు అగ్రజుడు అని షష్ఠి కాకుండా,

భరతుడు అగ్రజుడుగా కలవాడు అని బహువ్రీహి చేసి సరిపెట్టాడాయన.


అయితే కొంతమంది ఆధునికులు

భరతాగ్రజ బదులు

సాహసించి భరతానుజ అని శ్లోకంలోనే మార్చేసి, సులువుగా అర్థం వ్రాసేశారు.


అరణ్యకాండ వ్యాఖ్యానంలో 

'న సంఖ్యే భరతానుజః' అని భరత 

జ్యైష్ఠ్యవ్యంజక ప్రయోగమూ కలదని  గోవిందరాజు పేర్కొన్నాడు. 


తిలక వ్యాఖ్యానంలో

'తతో లక్ష్మణ మాసాద్య' అని పైన చెప్పిన శ్లోకానికి భరతుడు లక్ష్మణునకు  నమస్కరించినట్లే అర్థం చెప్పబడింది. 


కానీ దాన్ని, వేఱేలా సమర్థిస్తూ

జన్మప్రకరణం ప్రకారం 

భరతాత్కనిష్ఠ వయసాస్పష్టమ్ అయినప్పటికీ  అధికగుణాలచేత 

గురుత్వం సిద్ధించి లక్ష్మణుడు 

నమస్కరించ దగినవాడయ్యాడని వ్రాశారు.


పాయసప్రదానాన్నిబట్టి, 

వివాహక్రమాన్నిబట్టి 

(రాముని తర్వాత 

లక్ష్మణుని వివాహం జరిగింది.)

లక్ష్మణుడే జ్యేష్ఠుడైనా,

జననకాలరీతిచేత 

అది పరిహృతమైందని

గోవిందరాజు అన్నాడు.


అలాగే లక్ష్మణుని జ్యేష్ఠత్వం 

వాల్మీకి సమ్మతం కాదు 

అని కూడా స్పష్టంగా చెప్పలేమని 

వేదం వేంకట రాయశాస్త్రి గారి ఉవాచ.


అందువల్ల 

భాసుడు లక్ష్మణుడే జ్యేష్ఠుడని 

వ్రాయడం వల్ల ఆయన కాలం నాటికే

రామలక్ష్మణభరతశత్రుఘ్నులనే 

వాడుక వచ్చిందనవచ్చు. 


మంగళం మహత్ 




 

కామెంట్‌లు లేవు: