కాశీఖండం భీమఖండం
రెండూ శ్రీనాథుడే వ్రాసినా
వ్యాసుడు కాశిని బాసిన
వృత్తాంతం రెండు గ్రంథాల్లోనూ
వేర్వేరుగా ఉంది.
భీమఖండ వ్యాసఘట్టం
అగస్త్యుడు వ్యాసుని కాశిని బాసిన
కారణాన్ని అడిగాడు.
ఇద్దరూ (పిఠాపురసమీప)తుల్యభాగాతీర బిల్వతరువనాంతరంలో కలిశారు.
వ్యాసుడు సమాధానమిస్తూ,
"జైమిని పైలసుమంతులాది శిష్యులతో
తీర్థయాత్రకు కాశీ వచ్చాను.
ఏ శకునంలో వచ్చామో
అహోరాత్రాలు ఏడు రోజులు భిక్ష దొరక్క ఉపవాసం ఉన్నాం.
ఒక పతివ్రతైనా ఆహారం పెట్టలేదు ఆ రోజుల్లో.
ఎనిమిదో రోజునకూడా
భిక్షకోసం తిరిగాం.
నెత్తిన ఎండ మండిస్తూంటే
లేదు, నడవండి, పొండి, కూడదు
ఇలాంటి నిషేధ వాక్యాలతో చెవులు నిండగా
విప్రవాటంబులఁ బ్రతిగేహంబును బరిభ్రమించి విసికి విసిమాలి వేనరి యలసి యారటఁబొంది సొలసి జూఁకించి తూలి దూఁపటిలి యుల్లంబునఁ గ్రోధం బుద్భవించిన.
భిక్షాపాత్రల్ని ఱాతిమీద వంద ముక్కలయ్యేలా వేశాను.
ఏం చెప్పేది? ప్రజ్ఞావిభవం ఏమో అయిపోయి
చెడిపోగా కూడు లేని కారణాన కాశీని శపించాలనుకొన్నాను.
కోపాన్ని సంహరించమని శిష్యబృందం చెప్తున్నా వినకుండా
మాభూత్రై పూరుషీ విద్యా
మాభూత్రై పూరుషమ్ ధనమ్,
మాభూత్రై పూరుషీ భక్తిః
కాశ్యామ్ నివసతామ్ సదా.
అని శపించాలనుకొని
శాపజలాన్ని అందుకొందామనుకొంటే ఎందుకో కేలు సాగలేదు.
ఆ సమయంలో ఒక వృద్ధసీమంతిని
భిక్షకు రమ్మని ఇలా అంది.
క్రొన్నెలపువ్వుదాల్పునకుఁ గూరిమిభోగ పురంధ్రి కక్కటా
యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టికోపమే
లన్న ! ఘటించె దో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షితం
కిన్నకరోతిపాపమను కేవలనీతిఁ దలంచిచూడఁగన్.
ఆ తర్వాత మూడువందలమంది శిష్యులకు నాకు భోజనాలు పెట్టింది.
తిన్నాక, శివుడు కోపసంరంభంతో శిష్యులతో సహా కాశీని విడచిపొమ్మన్నాడు.
పార్వతి అనుగ్రహించి మఱెక్కడికీ వెళ్లకుండా దక్షిణకాశి దక్షవాటిక వెళ్లమని
అభ్యుదయాలవుతాయని వచించింది.
ఎప్పుడెప్పుడు ఆ భీమేశ్వరుని దర్శిస్తానో అని ఉవ్వళ్లూరుతూ వస్తూ నిన్ను కలిశాను."
అని ముగించాడు.
ఈ వ్యాసఘట్టాన్ని ప్రధానంగా తీసుకొని, శ్రీనాథుడు దక్షారామాన్ని భీమేశ్వరుని వైభవాన్ని వర్ణిస్తూ భీమఖండం రచించాడు.
కాశీఖండంలో ఉన్నదేమిటో చూద్దాం.
వ్యాసుడు పదివేల మంది శిష్యులతో పెద్దకాలం కాశీలో నివసించాడు.
ఆయన స్థైర్యాన్ని శివుడు పరీక్షించాలనుకొన్నాడు.
రెండవరోజుకే కోపం వచ్చేసింది.
శివుడు కాశీని విడచిపొమ్మన్నాడు కానీ వ్యాసుడు గడగడ వణకుతూ కాళ్లమీద పడ్డాక ఇలా అనుగ్రహించాడు.
కాశికాపురిఁ దొంటికట్టడ నుండక పుణ్యకాలమునందు భూతతిథుల వచ్చువాఁడవు శిష్యవర్గంబు నీవును నైదుకోశములకు నవలినేల నుండువాఁడవు పైఁడికుండలు ప్రాకార వలయంబుఁ బొడగానవచ్చుచోటఁ ద క్కన్యతిథులఁ దీర్థముల నిందింపకు బుద్ధిమంతుఁడవు గాఁ బొమ్ము బ్రదుకు
తే, మంచు నంత ర్హితుం డయ్యె నగజతోడ
విశ్వనాథుండు మునియును విశ్వభర్త
యాన తిచ్చిన చోటనే యధివసించెం
గాశికాపురి కెడదవ్వు కలుగునడవి.
మంగళం మహత్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి