నలుడలా అన్నాక ఒక రీతి విని, ఒకభంగి వినని ఆ దమయంతి కొంచెం సేపు, తల వంచుకొని, విచారించి, తరువాత నిట్టూర్పు విడచి ఇలా అంది.
"నీప్రవర్తన, క్రూరంగా ఉంది. మాటిమాటికీ, నా చెవుల్లో దిక్పాలుర దుష్టసందేశవాక్యాలనే సూదికొనల్ని చొప్పిస్తున్నావు. తగదిది. ఒద్దన్నాను కదా! అయినా యమదూతకు బాధకలిగించడం నైజమే.
ఎల్లి (నేటి వ్యవహారంలో రేపు) కల్యాణం (స్వయంవరం) వస్తోంది. ఈ అవాచిక వార్తలు మానెయ్యి.
ఓపిక ఉంటే నలుని వర్ణించు. నీ పాపం అంతా పోతుంది. నేడు, ఎల్లి సురలకేం తొందర వచ్చింది? విశ్రాంతి తీసుకో. హంస చూపిన చిత్రపటాన్ని గూర్చి ఆలోచిస్తే నీయందు నలుని రూపం కనిపిస్తోంది. (సరే) నీకు దణ్ణం పెడతాను. 'దేవతల్ని వరించు' అనే ప్రార్థన మానెయ్యి."
స్నేహం, ప్రేమ, మచ్చిక కలగలిపి దమయంతి పలికింది విని, నలుడు,
""నీవు వరించకపోయినా ఇంద్రుడు కల్పవృక్షాన్ని ప్రార్థించి, నిన్ను దివికి రప్పించుకొంటే నీకు దిక్కేది?
యాగం నిర్వహించి, దాని సహాయంతో అగ్ని నిన్ను పొందితే ఏం చేయగలవు? (సర్వకామనలను తీర్చే యాగాలతో అగ్నికి నిత్యసంబంధం కాబట్టి సులభమే. )
అలాగే తన దగ్గరున్న అగస్త్యుని ప్రార్థించి, యముడు, (అగస్త్యుడు యముని దగ్గర ఉండడం ఏమంటే ఆయన వింధ్యపర్వతాన్ని నియంత్రించి దక్షిణదిక్కున ఉండిపోయాడు కాబట్టి యమునికి దగ్గరని )
కామధేనువును యాచించి అంబుపతి (వరుణుడు) నిన్ను చేపడితే ఎలా మఱి?
(వరుణుడు చేసే యాగాలకు హవిస్సులకోసం కామధేనువు తల్లోకానికి పోయి ఉందని రఘువంశంలో ఉందికదా!సముద్రం ఆమెకు పుట్టిల్లు. వరుణునికి సులభురాలు అని.)
కాబట్టి ఎవరో ఒకరిని వరించు. భక్తితో దేవతల చిత్తాన్ని పట్టకపోతే పనులకు అంతరాయం కలుగుతుంది.(స్వయంవరం చెడుతుంది)" అన్నాడు.
సశేషం
మంగళం మహత్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి