ధర్మం క్రియారూపంలోనే ఉంటుందండి.
అందుకే దానికి సాధ్యం అని పేరు.
సాధింపబడేది, చేయబడేది ధర్మం అని తెలుసుకోవాలి.
అది క్రియాధారమూ, క్రియాఫలితమూను.
సర్వాగమానా మాచారః
ప్రథమం పరికల్పితః
ఆచార ప్రభవో ధర్మః
ధర్మస్య ప్రభు రచ్యుతః
సర్వాగమాలనుండి మొదట ఆచారం పరికల్పించబడింది. ఆచారం నుండి ధర్మం ప్రభవించింది. అటువంటి ధర్మానికి అచ్యుతుడు ప్రభువు.
అందువల్ల క్రియారూపంలోనే ధర్మం ప్రవర్తిలుతుంది.
ధర్మశబ్దానికి - “ధరతి విశ్వం ధర్మః
ధృఞ్ ధరణే” - విశ్వాన్ని ధరించేది అని నిర్వచనం.
తాని ధర్మాణి ప్రథమాన్యాస న్నితి వేదే.
ఏష ధర్మస్సనాతనః ఇతి లోకే.
ధరతి లోకానితి ధర్మః - లోకాల్ని ధరించేది.
ధ్రియతే వా జనైరితి ధర్మః - జనులచేత పూనబడేది.
"ధారణాత్ ధర్మమిత్యాహుః"
మనం దానిని ధరించుట చేతనూ
(అనగా ఆచరించడం చేత)
దాని చేత ధరింపబడుట చేతనూ
(అనగా మనల్ని రక్షించుట చేతను)
ఆ అర్థం సార్ధకం.
అందుకే “ధర్మో రక్షతి రక్షితః" మనచేత రక్షింపబడిననాడు ధర్మం మనలను రక్షిస్తుం దని చెప్పబడింది. అంటే - ధర్మమార్గంలో నడచిన వానిని సుఖశాంతులు, శాశ్వతకీర్తి, ఆముష్మికలోకాలు కలుగుతాయి.
పురుషార్థాల్లో ధర్మానిదే కదా! మొదటిస్థానం.
ధర్మయుతంగానే అర్థకామమోక్షాల్ని సాధించాలి.
"ధర్మశ్చ జానాతి నరస్యవృత్తమ్” -
మానవు లేపని చేసినా, ఎవరు చూడలేదని చాటునా మాటునా చేసినా, వాటి సుకృత - దుష్కృతాలను తెలిసికొని యమునికి సాక్ష్యమిస్తుంది ధర్మం. అందుకే ఈ ధర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కళ్లు తెరచుకొని ఉండాలి. కనుకే
'“ధర్మంచర” - “ధర్మం ఆచరించు."
"ధర్మాన్న ప్రమదితవ్యం" - ధర్మ విషయంలో పొరపాటు పనికిరాదు మొదలైన ఉపదేశ (శాసన) వాక్యాలెన్నో వేదశాస్త్రాలు వివరించాయి.
ధర్మవిరుద్ధమైన ఏపనీ శ్రేయస్సు నివ్వదని గీతోపదేశం.
ధర్మోనామ 'శ్లో॥ విద్వద్భిస్సేవితం సద్భిర్నిత్య మద్వేషరాగిభిః హృదయే -నాభ్యనుజ్ఞాతో యో ధర్మస్తం నిబోధ'తేతి మనువచనాత్ శిష్టాచారానుమిత శ్రుతి స్మృతి ప్రమాణక శ్రేయస్సాధన భూతో జ్యోతిప్టోమాదిః। చోదనాలక్షణార్థో ధర్మ ఇతి జైమిని వచనాచ్చ యజేతేత్యాది విధిబోధితో వేదప్రమాణకం శ్రేయస్సాధనం జ్యోతిప్టోమాది రేవ ధర్మః.
ధర్మమనగా:- 'రాగద్వేషాల్ని పారద్రోలిన మహాత్ములు నిత్యం దేన్ని సేవిస్తారో,
వారు దేన్ని అనుమతిస్తారో అది ధర్మం'.
ఈ స్మృతివాక్యాన్నిబట్టి మోక్షసాధనమైన జ్యోతిష్టోమం మున్నగు సత్కర్మలే ధర్మమని గుర్తించాలి. ఈ కర్మలు వేదాలవల్ల, ధర్మశాస్త్రాలవల్ల, సదాచార సంపన్నులైన మహాత్ముల ఆచరణాలవల్ల గ్రహించాలి.
అదీగాక 'చోదనాలక్షణోఽర్థోధర్మః' అనే జైమినిసూత్రం వల్ల కూడా జ్యోతిష్టోమాది యాగాలే ధర్మమని తెలుస్తోంది.
(చోదనాలక్షణః =వేదములో 'చేయవలెను' అనే అర్థం వచ్చే ప్రత్యయం కలిగినట్టి,
అర్థః = శ్రేయస్సాధనమైనట్టి కర్మ,
ధర్మః= ధర్మం అని సదరు జైమినివాక్యానికి అర్థం.
పైవన్నీ పరిశీలించి చూస్తే ధర్మం చేయబడేది అని తెలుస్తుంది.
అయితే
"శ్రుతిశ్చ భిన్నా స్మృతయశ్చ భిన్నా మహామునీనాం మతయశ్చ భిన్నాఃధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం మహాజనో యేన గతస్స పంథా"
ఒకే విషయంలో భిన్నమార్గాల్ని ఆదేశించే రెండు వేదవాక్యాలు, అలాగే రెండు స్మృతివాక్యాలు కనిపించి తికమకపరిస్తే అలాంటప్పుడు పెద్దల ఆచార మెలా ఉంటుందో తెలుసుకొని దాన్ని ప్రమాణంగా గ్రహించాలి.
అలాగే
పరధర్మాన్ని అనుష్ఠించరాదు.
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః.
తల్లి తండ్రుల సేవ చేయడం ధర్మం.
మీ వృత్తిని సరిగా చేయడం ధర్మం.
ఆశ్రితుల్ని పోషించడం ధర్మం.
ఇలా ప్రతిపని ధర్మం తప్పకుండా చేయాలి.
మంగళం మహత్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి