8, ఫిబ్రవరి 2023, బుధవారం

సప్తాక్షరమంత్రం

  ఏ స్వల్ప ప్రయత్నంచేత 

విష్ణుసహస్రనామస్తోత్రపఠనఫలితం లభిస్తుంది?

దీనికి విష్ణుసహస్రనామస్తోత్రం ఉత్తరపీఠికలో సమాధానముంది.


పార్వత్యువాచ


కేనోపాయేన లఘునా 

విష్ణోర్నామ సహస్రకమ్

పఠ్యతే పండితైర్నిత్యం

శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో


"ప్రభూ! ఏ ఉపాయంచేత విష్ణుసహస్రనామం తేలిక/చిన్నగా నిత్యం పండితులచేత పఠింపబడుతుందో దాన్ని నేను వినగోరుతున్నాను. (చెప్పు)."


(సహస్రనామాలు చదివే ఓపిక లేదా వీలు లేనప్పుడు సులువుగా దేన్ని పఠిస్తే విష్ణుసహస్రనామస్తోత్రపఠనఫలితం లభిస్తుంది?)

అని ఒకనాడు పార్వతి పరమశివుని ప్రశ్నించింది.


అపుడు ఈశ్వరుడు,


"శ్రీరామ రామ రామేతి

రమే రామే మనోరమే

సహస్ర నామ తత్తుల్యం

రామ నామ వరాననే


మనస్సును రంజింపజేసే ఓ పార్వతీ!

(నేను) శ్రీరామ రామ రామ అని (జపిస్తూ)

రాముని యందు రమిస్తూంటాను.

(ఆనందిస్తూంటాను.)


శ్రేష్ఠ/అందమైన ముఖం కలదానా!/సుముఖీ!

ఆ రామనామం సహస్రనామాలతో సమానమైనది.


(సహస్రనామాలు పఠించలేనివారు ముమ్మారు (త్రికరణశుద్ధిగా) శ్రీరామ రామ రామ అంటే సహస్రనామపారాయణంతో సమానమైన ఫలితం లభిస్తుంది.)"


అని ఉపదేశించాడు.



నా(గ)స్వ(ర)వ్యాఖ్య: 


మనోరమే, వరాననే అన్నవి పార్వతిని ఉద్దేశించిన సంబోధనలు.


మఱి మనం మంత్రంగా పఠించేటప్పుడు అనవచ్చా ? అంటే 


"అవి స్త్రీలింగపదాలైనప్పుడు పార్వతికి సంబంధించిన సంబోధనలే.


పుంలింగాలైతే 

మనోరముడైన 

వరాననుడైన రామునియందు 

రమిస్తున్నాను" అని మంత్రవేత్తలు వివరణ ఇచ్చారు.



గుణాలు మనస్సుని ఆకర్షిస్తాయి.

అందువల్ల రాముడు తన శ్రేష్ఠమైన గుణాలతో మనోరముడు,

తన సౌందర్యాతిశయంతో వరాననుడు అయ్యాడు.


అందువల్ల ఈశ్వరుడే రామతత్త్వమందు రమిస్తూ స్వయంగా రామనామం సహస్రనామతుల్యం అని ఉపదేశించాడు 

శ్రీరామ రామ రామలో 

శకార రకార ఇకార బీజమయమైన

"శ్రీ"ని ప్రథమంగా చేర్చి,

మహామంత్రాలకు మూలమైన 

ఈశ్వరుడే చెప్పినందువల్ల

ఇది మహామంత్రమైంది.

కాన సర్వులూ శ్రీరామ రామ రామ అని జపిస్తూ సహస్రనామజపఫలితాన్ని పొంది, తరించెదరు గాక!



మంగళం మహత్ 






కామెంట్‌లు లేవు: